పండ్ల మాలతో స్వాగతం
తిరువొత్తియూరు: తాంబరం ఏఐఏడీఎంకే అభ్యర్థి సిట్లపాక్కం ఎస్.రాజేంద్రన్కు, మధ్య ప్రాంత పార్టీ కార్యదర్శి ఎల్లార్ సెలియన్ నాయకత్వంలో ఇరుంబులియూర్ 60వ వార్డులో, జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ లాయర్ యు.వినోద్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. జిల్లా అమ్మా పేరవై కార్యదర్శి జి.ఎస్. పురుషోత్తమన్ సమక్షంలో ఆయనకు క్రేన్ ద్వారా అనాస పండ్ల మాలను వేసి సత్కరించారు. 500 మందికి పైగా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి టి.కె.ఎం.చిన్నయ్య, కూటమి పార్టీల నేతలు వి.ఎన్. వేణుగోపాల్, కుప్పుసామి, కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసులకు స్వేచ్ఛనిస్తా!
కొరుక్కుపేట: రాయపురం నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.జయకుమార్ రెండు ఆకుల గుర్తు కోసం ఓట్లు అభ్యర్థిస్తూ వీధుల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు తరలివచ్చారు. రాయపురంలో పోలీసులను కొట్టిన ఘటన టెలివిజన్లో ప్రసారం చేయబడింది. ఈ పాలనలో పోలీసులకు గౌరవం లేదని, వారు పాలనలో మార్పు కోరుకుంటున్నారని, పోలీసులే రాజకీయ జోక్యం కోరుకుంటున్నారని తెలిపారు. రాయపురంలో ఏదో పందెం నడుస్తోందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక, పోలీసులను స్వేచ్ఛగా వారి పని చేసుకోనిస్తానని హామీ ఇచ్చారు. రాయపురంలో తన గెలుపు అవకాశాలు పదిలంగా ఉన్నాయని, ప్రచారం చేస్తున్నప్పుడు, అర కిలోమీటరు పరిధిలోనే ప్రజలు, వలంటీర్లు గుమిగూడుతున్నారని తెలిపారు. మిత్రపక్షాల సభ్యులు కూడా వస్తున్నారని, ఇది తాను భారీ విజయం సాధిస్తాననే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. రాయపురంలో గంజాయి చాలా ఎక్కువగా ఉందని, శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. సామాన్య ప్రజలు ఆశించే ప్రశాంతమైన జీవితం లేదని, ఎన్నో లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. తాను లంచాలు తీసుకోనని, ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, ప్రజలకు చాలా మేలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
రూ.కోటి టాస్మాక్
నగదు సీజ్
తిరువొత్తియూరు: తాంబరం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి దినేష్ నాయకత్వంలో పోలీసులు తాంబరం–వేలచ్చేరి ప్రధాన రహదారిలోని సెంబక్కం ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అప్పుడు ఆ మార్గంలో వచ్చిన ఒక వ్యాన్ను ఆపి అధికారులు తనిఖీ చేయగా, అందులో కట్టల కొద్దీ నగదు ఉంది. దీనిని గమనించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకుని తాంబరం తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. అక్కడ రెవెన్యూ కోర్టు అధికారి మురళీ, తహశీల్దార్ నటరాజ్, సేలయూర్ ఇన్స్పెక్టర్ ఢిల్లీబాబు సమక్షంలో నగదును తీసుకువచ్చిన రాజేష్(30), కపిలన్(42) అనే వ్యక్తులను విచారించారు. అప్పుడు వారు, ప్రభుత్వ మద్యం దుకాణాల టాస్మాక్ నుండి వసూలు చేసిన నగదును అంబత్తూరుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. అధికారులు ఆ నగదును లెక్కించగా, అందులో రూ 1 కోటి 20లక్షల 60 వేల 717 ఉన్నట్లు తేలింది. అయితే ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు (పత్రాలు) లేకపోవడంతో పాటు, నగదు తీసుకువచ్చిన వారు చెప్పిన సమాచారంలో పొంతన లేకపోవడంతో అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించి, నగదుతో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను వారికి అప్పగించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ నగదుపై తదుపరి విచారణ జరుపుతున్నారు.
పంచెలు స్వాధీనం
సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడు సమీపంలోని ఒక ఇంట్లో దాచి ఉంచిన 7,000 ధోవతులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు సమీపంలో ఉన్న ఊంజనై గ్రామంలోని బావి తోటలో నివసించే కేఎండీ పార్టీ సభ్యుడు గురుస్వామి ఇంటి వద్ద, ఒక కంటైనర్ లారీలో పెద్ద మొత్తంలో బహుమతుల ప్యాకేజీలను నిల్వ ఉంచారని నామక్కల్ జిల్లా ఎన్నికల నియంత్రణ ఆఫీసుకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నామక్కల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దుర్గామూర్తి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాలని ఫ్లయింగ్ స్క్వాడ్ను ఆదేశించారు. శనివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెట్రివేల్ నేతృత్వంలో సాయుధ పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురుస్వామి ఇంటిపై దాడి చేశారు. పార్కింగ్ స్థలంలోని ఒక గదిలో 37 కట్టలలో దాచి ఉంచిన 7,000 ధోవతులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ధోవతులను తిరుచెంగోడు రిటర్నింగ్ ఆఫీసర్, రెవెన్యూ డివిజనల్ కమిషనర్ అయిన లెనిన్కు అప్పగించారు. తిరుచెంగోడు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


