తిరువళ్లూరు: అంబత్తూరు శాసనసభ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పూర్ణిమకు ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు మద్దతు పలికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు నిరాకరించి అక్కడ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూర్ణిమకు డీఎంకే అధిష్టానం సీటును కేటాయించింది. సీటు దక్కిన వెంటనే అందరిని కలుపుకుని డాక్టర్ పూర్ణిమ అంబత్తూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ పూర్ణిమను ఎంఆర్పీఎస్ నేతలు శుక్రవారం ఉదయం కలిసి సత్కరించారు. అనంతరం పట్టణంలో పూర్ణిమతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉత్తర చైన్నె కార్యదర్శి జోసెఫ్, రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి సుకుమార్, నిర్వాహణ కార్యదర్శి భాస్కర్, ముకుందరావు, మోసస్, ఆనందరావు, సాల్మన్, బాబు, రామకృష్ణ, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.


