– అన్నాడీఎంకే అభ్యర్థి బీవీ రమణ
తిరువళ్లూరు: రాష్ట్రంలో అధికార మార్పిడి ఏర్పడి అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే జిల్లాలోని అన్ని అక్రమ క్వారీల నిర్వహణపై విచారణ చేస్తామని అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ స్పష్టం చేశారు. తిరువళ్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి రమణ కడంబత్తూరులోని ప్రియాంకుప్పం, ఏగాటూరు, శ్రీదేవికుప్పం, విడయూరు, కారణి తదితర గ్రామాల్లో ఆ పార్టీ నేతలతో కలసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా సహకార సంఘాల ద్వారా అందజేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కావేరిరాజపురంతోపాటు ఇతర అక్రమ క్వారీలకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక్కడ నిబంధనలను విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. మట్టి క్వారీల ద్వారా వచ్చిన నగదును ఎన్నికలకు డీఎంకే నేతలు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వీటిపై దర్యాప్తు చేస్తామని, తాము అధికారంలోకి వస్తే అన్ని అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


