మిత్రులకు ఇచ్చిన సీట్లు పోగా 169 స్థానాలలో 42 మంది కొత్త ముఖాలు, మరో 46 మంది సిట్టింగ్లు, ఇతర ముఖ్య నేతలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీట్లు కేటాయించారు. 17 మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే మాజీ స్పీకర్ ధనపాల్కు, మాజీ మంత్రులు సేవూరు రామచంద్రన్, వెల్లమండి నటరాజన్, వైగై సెల్వన్, సరోజ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోవింద స్వామి, రామచంద్రన్ రాణి, కబీర్ సెంథిల్, మహేంద్రన్ తదితరులతో పాటుగా 13 మందికి అవకాశం ఇవ్వలేదు. అన్నాడీఎంకేను పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న తదుపరి ఎదుర్కొంటున్న ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో పళణి స్వామి వ్యూహాత్మకంగా అన్ని ప్రధాన జిల్లాలను కవర్ చేస్తూ, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను పళణి స్వామి ఎంపిక చేశారు. ముఖ్యంగా డెల్టా, దక్షిణ జిల్లాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గంలో ఆరో సారిగా పళణి స్వామి పోటీలో ఉన్నారు. ఆయన తదుపరి పార్టీలో కీలకంగా ఉన్న కేపీ మునుస్వామి వేపనహల్లిలో, ఎస్పీ వేలుమణి కోయంబత్తూరు జిల్లా తొండా ముత్తురులో, నత్తం విశ్వనాథన్ నత్తంలో, పి.తంగమణి కుమార పాళయంలో, మైలంలో రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం, చైన్నె రాయపురంలో ఎనిమిదో సారిగా డి.జయకుమార్ తదితర కీలక నేతలు పోటీలో ఉన్నారు.


