సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 18వ తేదీన తమిళనాడుకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి జిల్లాలోని తురైయూర్లో కాంగ్రెస్ అభ్యర్థి లెనిన్కు మద్దతుగా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఎన్నికల ప్రచార సమయం మరి కొద్ది రోజులలో ముగియనున్నది. ఇంత వరకు కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవ్వరూ ప్రచారానికి రాక పోవడంతో అభ్యర్థులలో టెన్షన్ తప్పలేదు. ఈ పరిస్థితులలో ఎట్టకేలకు రాహుల్ గాంధి పర్యటన ఖరారు చేశారు. 18న ఢిల్లీ నుంచి చైన్నెకు వచ్చే రాహుల్గాంధీ హెలికాఫ్టర్ ద్వారా పొన్నేరి నియోజకవర్గంకు వెళ్లి, అక్కడి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం షోళింగర్లో జరిగే బహిరంగ సభకు హజరు అవుతారు. సాయంత్రం తిరుచ్చి తురయూర్లో జరిగే బహిరంగ సభకు హాజరు అవుతారు. ఇక్కడ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, రాహుల్ గాంధితో పాటుగా కూటమిలోని ఇతర పార్టీల నేతలందరూ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఆ తదుపరి 20వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కన్యాకుమారి జిల్లాలోని కులచాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.


