సాక్షి, చైన్నె : వృద్ధులకు మెరుగైన నివారణ ఆరోగ్య సంరక్షణను అందించే దిశగా సమగ్ర వృద్ధుల సంరక్షణలో లక్ష్యంతో ‘గెరి కేర్’ సంస్థ, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ‘గెరియాట్రిక్ వ్యాక్సినేషన్ సెంటర్’ను చైన్నెలో ప్రారంభించింది. చైన్నెలోని టి.నగర్, ఆదంబాక్కం, అడయార్లోని గెరి కేర్ కేంద్రాలతో పాటు, ఆ సంస్థకు చెందిన అన్ని క్లినిక్లు నర్సింగ్ హోమ్స్లో ఈ వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాన్ని 80 ఏళ్ల వృద్ధుడు, ప్రొఫెసర్ పి.ఎస్. చంద్రమౌళి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గెరి కేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీపతి రమేష్, పలువురు ప్రముఖ వైద్యులు ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీపతి రమేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు నివారణ ఆరోగ్య సంరక్షణ అనేది చాలా నిర్లక్ష్యం చేయబడుతోందన్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు ఉన్న వృద్ధులకు ఇన్సులేషన్, న్యూమోకాకల్ వంటి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు.. సరైన సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఆసుపత్రిలో చేరే అవకాశాలను 40–60 శాతంవరకు తగ్గించవచ్చు అని తెలిపారు.


