వివాదంలో అధవ్‌ అఫిడవిట్‌ | - | Sakshi
Sakshi News home page

వివాదంలో అధవ్‌ అఫిడవిట్‌

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌

సాక్షి,చైన్నె: విల్లివాక్కం నియోజకవర్గ తమిళగ వెట్రి కళగం అభ్యర్థి అధవ్‌ అర్జున తన నామినేషన్‌ పత్రాల్లో ఆస్తి వివరాలను దాచిపెట్టారని, దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరుతూ గురువారం మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విల్లివాక్కం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న జి. దేవరాజన్‌ ఈ పిటిషన్‌న్‌ను దాఖలు చేశారు. పిటిషనర్‌ పేర్కొన్న ప్రధానాంశాలు ఈవిధంగా ఉన్నాయి. నామినేషన్‌ ఫారం–26లో అభ్యర్థులు తమతో పాటు తమ భాగస్వామి ఆస్తులను కూడా తప్పనిసరిగా పేర్కొనాలని వివరించారు. అయితే, అధవ్‌అర్జున్‌ తన భార్య అధవ్‌ డైసీ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. రూ.117 కోట్ల విలువైన మార్టిన్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌, రూ.123 కోట్ల విలువైన డామినెంట్‌ టవర్స్‌ వంటి వివిధ కంపెనీలలో డైసీ డైరెక్టర్‌గా ఉన్నారని, ఈ వివరాలను నామినేషన్‌న్‌లో పేర్కొనలేదని పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు. ఈ ఆస్తుల్లో చాలా వాటిని ఈడీ ఇప్పటికే స్తంభింపజేసిందని పిటిషనర్‌ గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే తాను దీనిపై ఫిర్యాదు చేసినా, ఎన్నికల అధికారి సరైన విచారణ జరపకుండానే తన ఫిర్యాదును తిరస్కరించారని దేవరాజన్‌ ఆరోపించారు. ఎన్నికల అధికారి జారీ చేసిన ఆ ఉత్తర్వును రద్దు చేయాలని, ఆస్తి వివరాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసు త్వరలోనే విచారణకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement