తిరుత్తణి: గత ఎన్నికల్లో తనను ఓడించిన ప్రజలు, ఈసారి మాత్రం తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే ప్రజల గొంతు వినిపిస్తానని వేడుకున్నారు. తిరుత్తణి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి ఆర్కేపేట యూనియన్లోని పలు గ్రామాల్లో బుధవారం ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తాను పోటీ చేసి మీ వద్దకు వచ్చి ఓట్లు అడిగాను. అయితే మీరు తనకు ఓట్లేయకుండా ఓడించారు. దీంతో ఐదేళ్లు నుంచి కష్టాలు చెందాను. మీపై నమ్మకంతో మరోసారి పోటీ చేస్తున్నాను.ఈ సారి ప్రజలు తనపై కరుణ వుంచి గెలిపిస్తారని నమ్ముతున్నాను. తనను గెలిపిస్తే నిత్యం మీతో వుంటూ అసెంబ్లీలో మీ గొంతు వినిపిస్తానని తెలిపారు. తనను గెలిపిస్తారా అని ప్రజలను హరి ప్రశ్నించగా చాలా మంది మౌనంగా వుండడంతో మౌనంగా వుంటే ఏమిటని ప్రశ్నించగా తనను ఈ సారి గెలిపిస్తారా అని మరోసారి అడగ్గా ఈ సారి రెండాకుల గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామని మహిళలు చెప్పడంతో అక్కడ నుంచి హరి మరో గ్రామంలో ప్రచారానికి బయల్దేరి వెళ్లారు.


