నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త
● కేవీ కేంద్రం వెల్లడి
సేలం : చైన్నె నగర వ్యాప్తంగా 14 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఆ పాఠశాలలు అన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కింద పని చేస్తున్నాయి. ఈ స్థితిలో కేవీ వెబ్సైట్ పేరిట నకిలీ వెబ్సైట్లు పని చేస్తున్న సమాచారం వెల్లడైంది. ఈక్రమంలో కేవీ చైన్నె కేంద్రం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో కేంద్రియ విద్యాలయ పాఠశాల పేరిట కొన్ని నకిలీ వెబ్సైట్లు పని చేస్తున్నాయని తెలిపారు. వాటి ద్వారా విడుదలయ్యే ప్రకటనలను నమ్మవద్దని కోరారు. కేంద్రియ విద్యాలయ పాఠశాలల గురించిన మొత్తం సమాచారం జుఠిట్చ ుఽజ్చ్టజ్చి ుఽ. ుఽజీఛి.జీ ుఽ అనే వెబ్సైట్ ద్వారా మాత్రం వెలువడుతాయని, కనుక నకిలీ వెబ్సైట్ ద్వారా విడుదల సమాచారాన్ని నమ్మవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ విభాగం హెచ్చరించింది.
విమానం ల్యాండింగ్పై గందరగోళం
సాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండింగ్ ఉత్కంఠగా మారింది. రెండుసార్లు ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమైన ఫైలట్, అర్ధగంట పాటూ గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ముంబై నుంచి గురువారం ఉదయం 9 గంటలకు చైన్నెకు విమానం బయలు దేరింది. 11 గంటల సమయంలో ఇది ల్యాండింగ్ కావాల్సి ఉంది. అనంతరం 11.45కు ఈ విమానం మదురై బయలుదేరాల్సి ఉంది. ఈ విమానంలో 164 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే మీద ఎదురైన పరిస్థితితో ఫైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశారు. పది నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టి మళ్లీ ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండుసార్లు ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఉత్కంఠ నెలకొంది. మొదటి రన్ వేపై అధికారులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. చివరకు మరో 20 నిమిషాలు గాల్లో విమానం చక్కర్లు కొట్టినానంతరం సురక్షితంగా ల్యాండింగ్ అయింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులకు టెన్షన్ తప్పలేదు. అనంతరం భద్రతా పరంగా అన్ని చర్యలు, పరిశీలనతో విమానం గంట ఆలస్యంగామదురైకు బయలు దేరింది. మదురైకు వెళ్లాల్సిన 127 మంది ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.
చైన్నె పోర్ట్ – కామరాజ్ పోర్ట్ రూ.1000 కోట్ల వసూళ్ల రికార్డు
● చైన్నె పోర్ట్ అథారిటీ చైర్మన్ సునీల్ పాలివాల్
కొరుక్కుపేట: చైన్నె పోర్ట్ అథారిటీ, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్ల వసూళ్ల రికార్డు సష్టించిందని చైన్నె పోర్ట్ అథారిటీ చైర్మన్ సునీల్ పలివాల్ తెలిపారు. గురువారం ఉదయం పోర్ట్ ఆర్థిక పనితీరును ప్రకటించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చైన్నె పోర్ట్, కామరాజ్ పోర్ట్ మొత్తం 103.36 మిలియన్ మెట్రిక్ టన్నులతో సంయుక్త కార్గో ఉత్పత్తిలో మొదటిసారిగా 100 మిలియన్ మెట్రిక్ టన్నులను దాటి ఒక చారిత్రాత్మక మైలురాయిని సాదించిందన్నారు. ఇందులో చైన్నె పోర్ట్ 54.96 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, కామరాజర్ పోర్ట్ 48.41 మిలియన్ మెట్రిక్ టన్నులను నిర్వహించిందన్నారు. చైన్నె ఓడరేవు ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం, కామరాజ్ పోర్ట్లో వార్షిక 6.9 శాతం వృద్ధిని చూపిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో, చైన్నె పోర్ట్, ఒక్కొక్కటి రూ.1000 కోట్ల నిర్వహణ ఆదాయంతో ఉమ్మడి రికార్డు సృష్టించిందన్నారు.
చైన్నెలో కదం తొక్కిన జాలర్లు
సాక్షి, చైన్నె: చైన్నెలోని జాలర్లు, వారి కుటుంబాలు కదంతొక్కారు. మెరీనా తీరంలో రోడ్డు మార్గంలో టూవే అనుమతి కోసం నిరసన, ఆందోళన నిర్వహించారు. చైన్నెలో మెరీనా బీచ్ కూత వేటు దూరంలో పట్టినంబాక్కం, శ్రీనివాసపురం, నొచ్చికుప్పం, ముల్లైప్పం, తదితర జాలర్ల గ్రామాలు ఉన్నాయి. మెరీనా – శాంతోమ్ రోడ్డులో మెట్రో నేపథ్యంలో ట్రాఫిక్ మార్పులు జరిగాయి. టూవేను వన్ వే చేశారు. దీంతో వాహనాలన్నీ జాలర్లగ్రామాల మీదుగా వెళ్తున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ రద్దీతో జాలర్లు నివసించే ప్రాంతాలు మునిగాయి. తమ ప్రాంతం రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండటం, అస్తవ్యస్తంగా పరిస్థితి మారడంతో శాంతోమ్ రోడ్డును టూవే గా మార్చలన్న నినాదంతో ఆ పరిసర గ్రామాల జాలర్లు, వారి కుటుంబాలు గురువారం ఉదయం చైన్నెలో ఆందోళన నిర్వహించారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోని పక్షంలో నిరసన ఉధృతం అవుతుందన్న హెచ్చరికలు చేశారు.
నకిలీ వెబ్సైట్లతో జాగ్రత్త


