నాగారం : ఫణిగిరి బౌద్ధక్షేత్ర సమగ్రాభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నాగారం మండలం ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే సామేలు వినతి మేరకు మంజూరు చేసిన ఈ నిధులతో ఫణిగిరి రహదారి నుంచి బౌద్ధ క్షేత్రానికి చేరుకొనే అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, కొండపైకి వెళ్లే మెట్ల దారి నిర్మాణం, సందర్శకులకు మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు. అంతకు ముందు ఇక్కడి బౌద్ధక్షేత్ర పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచిన చారిత్రక శిల్పను సందర్శించారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ డైరెక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ అర్జునరావు, పురావస్తుశాఖ ఏడీ నాగలక్ష్మిలు బౌద్ధ శిల్ప సంపద ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని.. నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు. భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ, పురావస్తుశాఖ డైరెక్టర్ అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ నాయక్, ఓఎస్డీ రాజు, ఏడీలు నాగలక్ష్మి, మల్లునాయక్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఫణిగిరి, ఈటూరు గ్రామాల సర్పంచ్లు ఎర్ర సావిత్రియాదగిరి, వంగూరి దామోదర్, నాయకులు పానుగంటి నర్సింహారెడ్డి, నాతి వీరమల్లు, పులిగిళ్ల వీరమల్లు, ఆలకుంట్ల బాలకృష్ణ పాల్గొన్నారు.
పురావస్తు, సాంస్కృతిక,
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన


