హుజూర్నగర్ : అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి ఎండీఎఫ్ నిధులతో మొత్తం 16 కీలక మౌలిక వసతుల నిర్మాణాలపై మంత్రి వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల నాణ్యత విషయంలో రాజీకి తావులేదన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి పని ప్రజలకు దశాబ్దాల పాటు ఉపయోగపడేలా ఉండాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణమే కాదని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం అన్నారు. సమావేశంలో హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి


