పెన్పహాడ్ : రైతులు మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. గురువారం పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల భూమి సారవంతం పెరుగుతందన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష ప్రాముఖ్యత, భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను సేకరించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.
కొలతల ప్రకారం ఉపాధి పనులు చేపట్టాలి
మోతె : ఉపాధి హామీ పనులను కొలతల ప్రకారం నాణ్యతగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ శిరీష అన్నారు. గురువారం మోతె మండలం రాఘవాపురం, హుస్సేన్బాద్ గ్రామాల్లో పర్యటించిన ఆమె ఉపాధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీలు ఉపాధి పనులు చేసే చోట కూలీలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా ఎంపీడీఓ, ఏపీఓకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, టీఏలు, ఎఫ్ఏలు, కూలీలు ఉన్నారు.
పోషకాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
నేరేడుచర్ల : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింహారావు అన్నారు. గురువారం నేరేడుచర్లలోని అంగన్వాడీ కేంద్రం– 2లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ యారవ లక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, కోఆర్డినేటర్ రాజేష్, ఏఎన్ఎం సునిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు ఉన్నారు.


