విద్యార్థులను సిద్ధం చేశాం
సూర్యాపేటటౌన్ : ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం సాక్షికి ఆయన ఇచ్చిన ఇంటర్ూయ్వలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. పదో తరగతి పరీక్షకు 12,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారి కోసం జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కోసం సిబ్బంది ఇలా అన్ని మౌళిక వసతులు కల్పించాం. ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లాకు రాగా వాటిని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల్లో భద్రపరిచాం. సీసీ కెమెరాల నిఘాలోనే సీఎస్, డీఓలు పరీక్ష పత్రాల సీల్ తీస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత కూడా అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి పోస్టాఫీస్ ద్వారా వారికి కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు.
లేటుగా వస్తే నో ఎంట్రీ
పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయం కంటే ఐదు నిమిషాల వరకు మాత్రమే (9:35) పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఐదు నిమిషాల దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తవులు అనుమతించరు.
పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎస్, డీఓతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాము. దాంతో పాటు నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున నియమించాం. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లు మూసివేసి ఉంచాలి.
ఆరు సబ్జెక్టులు.. ఏడు పరీక్షలు
పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జ్క్టులు ఉండగా ఏడు పరీక్షలు జరుగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ప్రతి పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజులు విరామం ఉంటుంది. ఈ విషయమై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పించాం. ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకున్నా.. లేదా విద్యార్థులు హాల్ టికెట్ పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో తమ పుట్టిన తేదీ నమోదు చేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా అవగాహన కల్పించి పరీక్షకు సిద్ధం చేశాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ను కూడా అందించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి.
ఫ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో
69 కేంద్రాలు
ఫ పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఫ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్


