ఎచ్చెర్ల : ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిందండ్రులు హాజరయ్యారు. మొదటి అడ్మిషన్ పొందిన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం గ్రామానికి చెందిన వి.ప్రీతి, అనకాపల్లి జిల్లాకు చెందిన సీహెచ్ దీక్షిత్ ధర్మతేజలకు డైరెక్టర్ గిరిధర్ మద్రాసు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ కన్వీనర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. తొలి రోజు 500 మందికి గాను 319 మంది అమ్మాయిలు, 104 మంది అబ్బాయిలు మొత్తం 423 మంది అడ్మిషన్లు పొందారని వివరించారు. 24వ తేదీన 500 మందికి కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. కార్య క్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు.


