టెక్కలి: రాధావల్లభపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు యర్ర శ్యామలరావు, తమ్మినేని రమణమూర్తి తదితరులపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారి ని కుటుంబ సభ్యులు 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బొడ్డేపల్లి వెంకటేష్, సనపల కృష్ణమూర్తి ఇరువురూ దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో శ్యామలరావు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. రమణమూర్తి చేయి విరిగిపోయింది. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, రాధావల్లభపురానికి చెందిన నాయకులు అజయ్కుమార్, సనపల కృష్ణారావు తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిందనే సమాచారం తెలుసుకున్న నాయకులు కర్ణిక జీవన్, బడ్డ రాజేష్, ఆట్ల రాహుల్, బర్ల కార్తీక్, చింతాడ జీవన్, కవిటి చిన్న, బగాది జయరాం, మెండ భాస్కర్ తదితరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గతంలో గ్రామంలోని ఓ కేసు విషయమై సాక్షులుగా ఉన్న తమను బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని బాధితులు తెలియజేశారు. మరో 8 మందికి కొడతామని బెదిరించారని, కిల్లి అజయ్ను చంపేస్తామని అన్నారని తెలిపారు. దాడి ఘటనపై తిలక్ మాట్లాడుతూ గ్రామాల్లో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టేది లేదని, టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


