శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ రెండేళ్లలో ఏం సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సూర్య మహల్ జంక్షన్ వద్ద సో మవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో నాలు గు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతుంటే.. సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పైచిలుకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు వసంత్, హేమంత్, జగదీశ్, రామోజీ తదితరులు పాల్గొన్నారు.


