● జగనన్న కాలనీలో ఆక్రమణలకు గురవుతున్న ఖాళీ స్థలాలు
● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు
మండలంలో ఈ మూడేళ్ల లో ఎవరికీ ఎలాంటి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. కేవలం జగనన్న కాలనీకి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, ఆన్లైన్లో ఉన్న లబ్ధిదారుల వివరాలు సరి చూసి వారి అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – ఎన్.వెంకటరావు,
తహసీల్దార్, ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలో పేద ల కోసం గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జగనన్న కాలనీలో ఖాలీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం పురపాలక సంఘం రత్తకన్న పరిధిలోని ఐదు లేఅవుట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి 1210 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఈ లేఅవుట్లలో కాలనీ భవిష్యత్ అవసరాల కోసం పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు అనువుగా కొంత స్థ లాలను విడిచి పెట్టి కాలనీ నిర్మాణాలకు అవసరమైన వసతులను కల్పించింది. ఈ క్రమంలో ఈ రత్తకన్న లేఅవుట్లలో ఇప్పటికే 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోగా.. మరి కొన్నింటిలో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. కొన్ని చోట్ల ఖాళీ స్థలాలు ఉండగా.. వాటిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. దీంతో జేసీబీలతో చదును చేయించి వాటిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టా లేకుండా నిర్మాణాలు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నిస్తే.. నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎదురు తిరుగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేశారని, అందుకే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. అధికారులు పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


