నరసన్నపేట: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రి యలో పారదర్శకత లోపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశా రు. కొత్తూరు మండలంలో సహా పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఓట్ల తనిఖీకి వస్తున్న అధికారులు ఓటరు సంతకం తీసుకున్న తర్వాత రెండు ఫారాలూ తీసుకుంటున్నారని, దీనికి వెనుక ఉన్న మోసం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఓట్లు గల్లంతు చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది తూచా పాటించాలని సూచించారు. కొత్తూరులో జరిగిన సంఘటనను ఉదాహరణగా కృష్ణదాస్ వివరించారు. కొత్తూరులో వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా రెవెన్యూ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ పూర్తి అయ్యే వరకూ వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


