శ్రీకాకుళం అర్బన్: నీట్ పరీక్షకు (ఈ నెల 21న ) హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణ అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), పెద్దపాడులోని కేంద్రీయ విద్యాలయం, శ్రీకాకుళం గుజరాతిపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 2,103 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. హాల్టికెట్ చూపించి ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో స్వస్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


