● రాజకీయాలకు అతీతంగా ఏకమవుదాం
● శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ శాసన మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని సప్తగిరి కల్యా ణ మండపంలో ఆదివారం తూర్పు కాపు ఆత్మగౌరవ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తూర్పుకాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తాను ఏ ఇతర కులాలకు వ్యతిరేకం కాదని తూర్పు కాపు జాతి అభ్యున్నతికి ప్రతి ఒక్కరం జీవితం ఇవ్వాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. విద్యతోనే జాతి అభివృద్ధి జరుగుతుందన్నారు.
విద్యతోనే పరిపుష్టి
విద్యతోనే తూర్పుకాపుల ఆర్థిక పరిపుష్టి సాధ్య పడుతుందని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. 35 రోజుల్లో తన కోసం నిరంతరం పనిచేసి గెలుపునకు బాటలు వేసి శాస నమండలికి పంపించడం తూర్పు కాపు జాతి గొప్పదనమని తెలిపారు. తూర్పు కాపు జాతిని విభజించి పాలించి వెనకబడేలా చేస్తున్నారని మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నా యుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశస్థాయి నాయకులుగా గొర్లె శ్రీరాములనాయుడు, బొత్స సత్యనారాయణలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని గొప్ప గౌరవాన్ని పొందారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగేలోపే కాపు జాతికి రావాల్సిన పద్ధతిలో రాజకీయ పదవులు వచ్చేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తూర్పు కాపులకు సామాజిక భవనం చాలా అవసరమని తెలిపారు.
పలు తీర్మానాలు..
జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఉద్యోగ, అవకాశాలు రిజర్వేషన్ హక్కులను కాపాడుకోవాలని, తూర్పు కాపులపై జరుగుతున్న దాడులు, బాధితులకు అండగా ఉండడం, బాధితులకు సామాజిక న్యాయం అందించడం చేయాలని తీర్మానించారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్కు జరిగిన అవమానంపై నిరసన, భవిష్యత్లో ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేయడం వంటివి తీర్మానాలు చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, ఆమదావలస నియోజకవర్గ పరిశీలకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు పిన్నింటి సాయికుమార్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు సురంగి మోహన్ రావు, శాసఫు జోగినాయుడు, పాండ్రంకి శంకర్, రౌతు సింహాచలం, డాక్టర్ ఎం.రామ జోగినాయుడు, కిల్లారి నారాయణరావు, అంకడాల తవిటన్న, పడాల తమ్మి నాయుడు, డాక్టర్ ప్రసన్నకుమార్, డోల తిరుమలరావు, వంజరాపు రమేష్, మక్కా శ్రీనివాస్, కెల్ల చిన్ని, అల్లు యుగంధర్, ప్రభాకర్, జె.ఎస్.రాజులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు హాజరయ్యారు.


