టెక్కలి: బొప్పాయిపురం పంచాయతీ నీలాపురం గ్రామానికి చెందిన మహాన్యూస్ రిపోర్టర్ కుప్పిలి ఉదయ్కుమార్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియల్లో భాగంగా ఆయన భార్య తలకొరివి పెట్టారు. ఈయనకు భార్యతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు బెండి నరసింగరావు, కోట రాము, పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు.
బస్సు ఢీకొని మహిళ మృతి
నందిగాం: నందిగాం పరిధిలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం ఇజ్జవరం పంచాయతీ రాజగోపాలపురం గ్రామానికి చెందిన జడ్యాడ అనసూయమ్మ(55) మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనసూయమ్మ కొద్ది రోజులుగా కాలినొప్పితో బాధపడుతుండటంతో చిన్న కుమారుడు ఉమాపతితో కలిసి ద్విచక్ర వాహనంపై పలాసలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా నందిగాం దాటాక ఇరుకుగా ఉన్న ఖానా వద్దకు వచ్చేసరికి తమిళనాడు ఊసూర్కు చెందిన స్పార్క్ మిండా కంపెనీ పశ్చిమబెంగాళ్ నుంచి కార్మికులను తీసుకువస్తున్న బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న అనసూయమ్మ కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉమాపతికి చెయ్యి విరిగిపోవడంతో హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనసూయమ్మకు భర్త దామోదరరావు, ముగ్గురు కుమారులు ఉన్నారు. నందిగాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


