వేతనంపై సందేహాలు
రెండు మూడు రోజుల్లో
బకాయిలు విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ఉపాధి వేతనదారుల వేదన ఎవరికీ పట్టడం లేదు. ఒళ్లు హూనమయ్యేలా పని చేసి వేతనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కొత్తగా ఉపాధి విధానంలో మార్పులు వచ్చిన తర్వాత వేతన దారులకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో కూలీ లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
పేరు మారినా.. తీరు మారునా
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ప్రస్తుత ప్రభు త్వం మార్చింది. ఈ స్థానంలో వీబీజీరామ్జీ అంటూ కొత్త పేరు తీసుకువచ్చింది. కూలీలకు పది దినాలు పెంచుతూ ఉత్తర్వులు చేసింది. అయితే ఈ కొత్త పథకంలో ఉపాధి కూలి దినాలు పెంచి నా ప్రయోజనం లేదు. కూలీ లకు వేతనాల చెల్లింపులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా ను నిర్ణయించింది. దీంతో ఈ పనులు ఈ ఏడాది అన్ని చోట్లా చురుగ్గా సాగడం లేదు. చేసిన పనికి బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. జిల్లాలో 30 మండలాలు, వాటి పరిధిలో 879 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి వేతన దారులకు కుటుంబానికి 150 రోజులు పని కల్పించాలి. కానీ ఇప్పటివరకు పనులు అరకొరగానే జరుగుతున్నాయి. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడమే దీనికి కారణమని వేతనదారులు చెబుతున్నారు.
తగ్గిన వేతన దారులు
జిల్లాలో దాదాపు 5 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో సుమారు పనికి వెళ్లే వేతనదారులు సుమారుగా 6.5 లక్షలు ఉన్నారు. అయి తే వీరిలో ఏటా పనులకు వెళ్తున్న వారు 4.5 లక్షలు మాత్రమే. గతంలో గరిష్టంగా 3.5 లక్షలు మంది వేతనదారులు పనులకు వెళ్లారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వేతనాలు మంజూరు కాకపోవడం, పనులు కల్పించకపోవడం, వేతనం తక్కువగా రావడంతో వేతనదారుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు.
మారని సాఫ్ట్వేర్
ఉపాధిలో కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం తగిన విధంగా సాఫ్ట్వేర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో బిల్లుల విషయమై స్పష్టత లేదు. 2025 ఏప్రిల్ నుంచి బకాయిలు పెట్టారు. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.52 కోట్లు కంటే ఎక్కువే ఉన్నాయి.
వసతుల లేమి..
ఉపాధి పనులు నిర్వహించే చోట వసతులు ఉండేవి. ప్రదానంగా మెడికల్ కిట్లు, తాగునీరు, టెంట్, పనిముట్లు వంటివి సరఫరా చేసేవారు. రెండేళ్లుగా కొత్తగా ఇలాంటి పరికరాలు మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎవరి పనిముట్లు వారే తీసుకెళ్తున్నారు. కనీసం పని చేసే చోట టెంట్లు, టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. వేసవిలో గతంలో ఓఆర్ఎస్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు.
ఒకప్పుడు వేసవి అలవెన్సులు ఇచ్చేవారు. ఆ సమయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయంలో పనులు చేసేవారు. అప్పుడు వేసవి అలవెన్సులు ఇతర వేతనం కలిపి సుమారుగా రూ.350 వరకు రోజు వేతనం గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుతం ఎంత వేతనం గిట్టుబాటు అవుతుందో తెలీదు. ప్రస్తుతం గరిష్ట వేతనం రోజుకి రూ. 307లు వరకు ఉంది. అయితే ఆ స్థాయిలో పనులు జరగకపోవడం, ఇతర అలవెన్స్లు లేకపోవడంతో కనీస వేతనం ఎంత వస్తుందో తెలీని పరిస్థితి ఉంది.
వేతనదారులకు రెండు మూడు రోజుల్లో బకాయిలు విడుదల కానున్నాయి. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేతనదారులు ఆందోళన చెందవద్దు.
– లవరాజు, డ్వామా పీడీ


