జి.సిగడాం: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ఉపాధ్యాయుల సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీటీఏఫ్ (257) జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, పూర్వ జిల్లా కార్యదర్శి దుంగ వీరయ్యలు తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నాయకులు ఐఆర్, పీఆర్సీ కమిటీలు ఏర్పాటు చేస్తామని అనేక హమీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో అప్గ్రేడ్ చేసిన పాఠశాలలకు హెచ్ఎంలు, పీడీ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పనిభారం పెట్టడంతోపాటు అనేక యాప్లతో నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు, యాప్ల పేరుతో విద్యార్థులకు విద్యను బోధించడానికి సమయం సరిపోవడం లేదన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పాత పెన్షన్ విధానం అమలు అయ్యేవరకు పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేకపోతే వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం విజయవాడలో నిర్వహించనున్న ధర్నాకు ఏపీటీఏఫ్ మండల శాఖ కిల్లారి వెంకటరమణ, యలకల ఆదినారాయణ, చిత్తిరి జగదేశ్వరరావు, పిట్టా అప్పారావు, కోనారి నారాయణప్పడు తదితరులు బయల్దేరి వెళ్లారు.


