శ్రీకాకుళం (పీఎన్కాలనీ), శ్రీకాకుళం అర్బన్: అంగన్వాడీలకు మే నెలంతా వేసవి సెలవులు అమలు చేయాలని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.గోవర్ధనరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కల్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం ఏడురోడ్ల కూడలివద్ద నిరసన చేపట్టి మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్ ప్రా రంభించి 50 ఏళ్లు పూర్తయినా నేటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని, కనీసవేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరిగినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2026–27కి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ అన్యాయం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూచార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చెయ్యాలని డిమాండ్ చేశారు.


