శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఉపనిషన్మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలలో భాగంగా గురు వారం విద్యారణ్య మహర్షుల జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యారణ్యులు రచించిన పంచదశీ గ్రంథంలోని ‘చిత్రదీప ప్రకరణ’ అనే అంశంపై తెన్నేటి విక్రమశర్మ ప్రసంగించారు. విద్యారణ్యులు తన రచనల ద్వారా ధర్మసంస్థాపన, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా సనాతన ధర్మ వ్యాప్తి చేశారని చెప్పారు. విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఆనాడు మతమార్పిడులను అరికట్టేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును సత్కరించారు. కార్యక్రమంలో సనపల నారాయణమూర్తి, కోమలరావు, శ్రీమన్నారాయణ, పట్నాయక్, విశ్వేశ్వరరావు, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.


