పలాస: ఉత్తరాంధ్ర జానపద కళల్లో తప్పెటగుళ్లు అత్యంత ప్రాచీన కళారూపమని రంగం ప్రజాసాంస్కృతిక వేదిక అధ్యక్షుడు రంగం రాజేష్ చెప్పారు. పలాసలో బుధవారం ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో తప్పెటగుళ్లు శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ శిబిరాన్ని రంగం రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో సినీనటుడు డాక్టరు కుమార్నాయక్, రంగం జిల్లా అధ్యక్షుడు కొర్రాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. యాదవ కుల సంస్కృతి సంప్రదాయాల నుంచి పుట్టిన ఈ తప్పెటగుళ్లు కేవలం వినోదం మాత్రమే కాదని, ఇందులో దాగి ఉన్న లయ, దరువు, శారీరక విన్యాసాలు అద్భుతమని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం వల్ల మరుగున పడిపోతున్న కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘కార్మికుల ప్రయోజనాల కోసమే చేనేత క్లస్టర్లు’
పొందూరు: ఖాదీ, చేనేత రంగాల్లో వడుకు, నేత కార్మికుల ప్రయోజనాల కోసం క్లస్టర్ల ఏర్పాటు తప్పనిసరని ఎన్ఆర్ఎల్ఎం జాతీయ మిషన్ మేనేజర్(న్యూఢిల్లీ) జావర్ధాన్ అన్నా రు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖాదీ, చేనేత కార్మికుల స్థితిగతులు, ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సెర్ప్ అధికారులతో కలిసి పొందూరులో పర్యటించారు. ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మిక సంఘం(ఏఎఫ్కేకే) మాస్టర్ వీవర్స్, ప్రైవేటు ఖాదీ సంస్థలను కలిశారు. పొందూరులో త్వరలో క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్లస్టర్ ఏర్పాటుపై ఏఎఫ్కెకె సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, దండా వెంకటరమణ, ప్రైవేటు ఖాదీ సంస్థ నిర్వాహకుడు బండారు జైప్రతాప్కుమార్, మాస్టర్ వీవర్లు, కార్మికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సెర్ప్ లైవ్లీహుడ్ డైరెక్టర్ పద్మావతి, సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ మహిత, ఎగ్జిక్యూటివ్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.


