నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
● దారిచూపే దీపంగా పుస్తకాలు
● సాంకేతిక యుగంలోనూ వన్నెతగ్గని వైనం
పఠనం
తప్పనిసరి..
పుస్తకం చదవడం వ్యసనంలా మారింది. నా 88 ఏళ్లు వయస్సులో ఎన్నో పుస్తకాలు చదివాను. ఇంకా చదువుతునే ఉంటాను. దానివల్ల కూడా రచయితగా మారాను.
– డాక్టర్ నిక్కు అప్పన్న, రిటైర్డ్ ప్రొఫెసర్,
శ్రీకాకుళం
ఇచ్ఛాపురం రూరల్/శ్రీకాకుళం కల్చరల్:
పుస్తక పఠనం ఓ మంచి అనుభూతి.. ఓ మథనం.. ఓ చైతన్యం.. వెరసి అనుభవాల సారం. ప్రతి పుస్తకంలో ఓ జీవితం దాగుంటుంది. పుస్తకమా..పుస్తకమా.. నిన్ను చదవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే...‘తల దించుకుని నన్ను చదువు...జీవితంలో నిన్ను తలెత్తుకుని జీవించేలా తయారు చేస్తా’ అంటుందట పాఠకుడితో. విజేతల్ని మీ అభిరుచి ఏంటని ప్రశ్నిస్తే ఎక్కువ మంది ఠక్కున చేప్పే సమాధానం పుస్తక పఠనమనే.. జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. మారుతున్న కాలానికనుగుణంగా ప్రస్తుతం పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు క్రమంగా తగ్గుతోంది. ఆన్లైన్ అభ్యసనంతో పట్టుమని పది నిమిషాలు కూడా విద్యార్థులు పుస్తకాలు చదవలేకపోతున్నారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రత్యేక కథనం..
పుస్తకాలతో ప్రయోజనాలివే..
● ఒంటరి తనం పారదోలి మంచి స్నేహితులుగా వ్యవహరిస్తాయి.
● ఏకాగ్రత పెరుగుతుంది. విషయాన్ని శ్రద్ధగా చదవడం అలవాటవుతుంది.
● పద సంపద వృద్ధి చెంది భాషపై పట్టు పెరుగుతుంది.
● భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది.
● ప్రాపంచక విషయాలు తెలుస్తాయి. లోకజ్ఞానం రెట్టింపవుతుంది.
● విజేతల ఆత్మకథలు చదివినప్పుడు స్ఫూర్తి, ప్రేరణ పొందవచ్చు.
● పరాజితుల అనుభవాలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి.
ప్రోత్సహించాలి..
కరోనా నుంచి చాలా మంది రచయితలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నారు. పుస్తకాన్ని కొని చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోవడం బాధాకరం. పిల్లల్లో పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహించాలి. – అట్టాడ అప్పలనాయుడు, రచయిత
ఇంట్లోనే గ్రంథాలయం
పుస్తకాలు చదడం చిన్నప్పటి నుండే అభిరుచిగా మారింది. ఎక్కడ కొత్త పుస్తకం కనబడినా వెంటనే కొనేయడం అలవాటైంది. మిత్రులు, సాహితీవేత్తలు కానుకగా ఇచ్చిన పుస్తకాలతో ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటైంది. – బెందాళం కృష్ణారావు, సాహితీవేత్త


