శ్రీకాకుళం కల్చరల్ : జిల్లాకు చెందిన వర్ధమాన రచయిత, ఉపాధ్యాయుడు కంచరాన భజంగరావు రాసిన ‘నీటి గింజల పంట’ కవితకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కృష్ణా యూనివర్సిటీ(మచిలీపట్నం)లోని ఎంఏ తెలుగు మూడో సెమిస్టర్ సిలబస్లో దీన్ని పాఠ్యాంశంగా చేర్చారు. ఇటీవల జరిగిన ఆ వర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీఓఎస్)లో సంబంధిత నిపుణులు దీనికి ఆమోదముద్ర వేశారు. డాక్టర్ ఎన్వీ కృష్ణారావు(ఆచార్య నాగార్జున వర్శిటీ), డాక్టర్ సుంకర గోపాలయ్య (ఉన్నత విద్యామండలి సిలబస్ కమిటీ సభ్యులు), వర్సిటీ తెలుగుశాఖాధిపతి, ఇతర సభ్యులతో కూడిన బీఓఎస్ ఎంఎ (తెలుగు) పాఠ్యాంశాన్ని సమీక్షించి నూతనంగా చేర్పులు, మార్పులు చేశారు. అందులో నీటిగింజల పంట కవితను మూడో సెమిస్టర్లో పొందుపరిచారు. ఈ గుర్తింపుపై ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు స్పందిస్తూ కళింగాంధ్ర బతుకు చిత్రానికి పట్టం కట్టిన నీటిగింజల పంటకు వర్సిటీ స్థాయిలో సుమిచిత స్థానం లభించినట్టు అయ్యిందన్నారు. కంచరాన భుజంగరావుకు ఈ గుర్తింపు లభించడంపై సహచర ఉపాధ్యాయులు, సాహితీ మిత్రులు అభినందనలు తెలియజేశారు.


