సోంపేట: సోంపేట పట్టణంలోని పెద్దకోమటి వీధి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (78) అనే వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పున్నాలు సోంపేట పట్టణంలో ఆకుకూరలు, పువ్వులు అమ్ముతుండేది. ఎప్పట్లాగే బుధవారం ఉదయం పెద్ద కోమటి వీధి వద్ద బారువ నుంచి కంచిలి వైపు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బైరాగి ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్ఐ మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పున్నాలు 78 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేది. పూలు, ఆకుకూరలు విక్రయిస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచేది. ఈమె మృతితో సోంపేట, పలాసపురంలో విషాదచాయలు అలముకున్నాయి.


