కంచిలి: దాదాపుగా ఖాళీ అయిపోతున్న ఊరి బడిని పెద్దలంతా కలిసి కాపాడుకున్నారు. పోలేరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం పది మంది విద్యార్థులే చదువుతుండేవారు. వీరిలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు పై తరగతికి ప్రమోట్ అవ్వడంతో ముగ్గురు విద్యార్థులే మిగలడంతో పాఠశాల మూసివేత దశకు వచ్చింది. ఈ విషయాన్ని హెచ్ఎం జనార్దనరావు, మిగిలిన సిబ్బంది గ్రహించారు. రెండు నెలలుగా ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్తులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, పాఠశాల పరిస్థితిని వివరించారు. దీంతో గ్రామస్తులు ప్రత్యేకంగా సమావేశమై ప్రైవేటు బడులకు వెళ్తున్న పిల్లలను తిరిగి ఈ బడిలో చేర్పించాలని నిర్ణయించారు. గడిచిన రెండు రోజులుగా పాఠశాల ఉపాధ్యాయుడు జనార్ధనరావు, గ్రామస్తులు, యువత అధిక సంఖ్యలో ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొని, ఇంటింటికీ తిరిగి ప్రైవేటు పాఠశాలలకు చెందిన 45 మంది విద్యార్థులను ఇక్కడ చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 48కి చేరి మోడల్ ప్రైమరీ పాఠశాలగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు పాఠశాలకు నలుగురు ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని మండల విద్యాశాఖాధికారి–1 ఎస్. శివరామ్ ప్రసాద్ అన్నారు.


