టెక్కలి: వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్న వారి కోసం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి సహాయ కార్మిక శాఖాధికారి ఎం.విజయకుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాలు, ఉపాధి హామీ పథకం వేతనదారులు సైతం ఈ–శ్రమ్కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవీ అర్హతలు...
● కార్మిక శాఖ అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవడానికి కొన్ని రకాల అర్హతలు ప్రామాణికం చేశారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు కార్మికుడు, కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు ధృవీకరణ ఉండాలి.
● వయసు 19 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆధార్, రేషన్కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
● ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులు సైతం నమోదు చేసుకోవచ్చు.
● కార్మిక శాఖా కార్యాలయంలో ఈ పత్రాలతో పాటు దరఖాస్తు, రూ.110 చలానా చెల్లించాలి.
ఇది ఐదేళ్ల పాటు కొనసాగుతుంది.
ఇవీ ప్రయోజనాలు...
కార్మికుల ఇంట్లో కుమార్తెలకు వివాహం సమయంలో (గరిష్టంగా ఇద్దరు కుమార్తెలు ) రూ.20 వేలు అందజేస్తారు.
ప్రసూతి వైద్య సాయం ద్వారా మహిళా కార్మికురాలికి, కార్మికుడి భార్యకు, కుమార్తెలకు రూ.20 వేల సాయం అందజేస్తారు.
సహజం మరణం పొందితే రూ.60 వేలు, నామినీ లేదా వారిపై ఆధారపడిన వారికి అందజేస్తారు. దహన సంస్కారాలకు రూ.20 వేలు చెల్లిస్తారు.


