శ్రీకాకుళం పాతబస్టాండ్: సాక్షి సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిపై పెట్టిన అక్రమ కేసు రద్దు చేయాలని కోరుతూ జిల్లా జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో సాక్షి సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసిన తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందన్నారు. జర్నలిజం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన కీలక మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడటంలో జిల్లా యంత్రాంగం
చొరవ చూపాలని, పోలీసు వ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మీడియా సమాఖ్య ప్రతినిధులు శాసపు జోగినాయుడు, బగాది అప్పలనాయుడు, తోట భీమారావు, బరాటం దుర్గాప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.


