వాచ్మెన్ ఇంత పనిచేస్తాడనుకోలేదు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
●కబ్జాకు గురైన రిజర్వ్ సైట్●తహసీల్దార్ సంతకం ఫోర్జరీ●నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్●పట్టించుకోని యంత్రాంగం
శ్రీకాకుళం రూరల్:
జిల్లా కేంద్రం సమీపంలో భూ ఆక్రమణల వ్యవహారాలు పెచ్చుమీరుతున్నాయి. మొన్నటికి మొన్న రాగోలులో 96 సెంట్లు కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు. తాజాగా విలీన పంచాయతీ పరిధిలోని ఎస్బీఐ స్టాఫ్ కాలనీకి చెందిన 11 సెంట్లు రిజర్వ్ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేయడానికి పూనుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం పరిధిలోని చాపురం పంచాయతీలో ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన ఎస్బీ ఐ స్టాఫ్ కాలనీలో గల 11 సెంట్లు విలువైన రిజర్వ్ స్థలాన్ని ఓ వ్యక్తి చేజిక్కించుకునేందుకు తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేశాడు. 1989–90లో ఎస్బీఐ స్టాఫ్ కాలనీకి చెందిన 68 మంది ఉద్యోగులు కలిసి చెరో ఐదున్నర సెంట్లు చొప్పున రెండెకరాలు విస్తీర్ణంలో సర్వే నంబర్ 254/1లో (పాతది 330/1) కొనుగోలు చేశారు. పంచాయతీ నిబంధనల ప్రకారం ఇందులో 11 సెంట్లు రిజర్వ్ స్థలంగా విడిచిపెట్టారు. ఒక్కొక్కరూ ఇల్లు కట్టుకునేందుకు గాను ఒక వాచ్మెన్ను అప్పట్లో నియమించుకున్నా రు. ఉదయం పూట ఆ వాచ్మెన్ వాటరింగ్ చేయడం, రాత్రయితే నిర్మాణపు ఇంటికి కాపాలా ఉండే లా కాలనీవాసులు నియమించుకున్నారు. కాలక్రమేణా వాచ్మెన్ వేర్వేరు చోట్ల కాపలా కాయాల్సి రావడంతో స్టాఫ్ కాలనీకు చెందిన వారంతా రిజర్వ్ స్థలంలో ఓ పాకను ఏర్పాటు చేసి అతడిని అక్కడే ఉండమని చెప్పారు. ఆ వ్యక్తి పదేళ్లకుపైగా అదే పాకలో ఉన్నారు. కొంతకాలం తర్వాత పాక వెనుక నుంచి రెండుసెంట్లు స్థల విస్తీర్ణంలో దర్జాగా ఓ మేడ నిర్మించేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తను కాపాలా ఉన్న 11 సెంట్లు రిజర్వ్ స్థలానికి నకి లీ డాక్యుమెంట్ సృష్టించి కబ్జాకు పూనుకున్నాడు.
కొద్ది రోజుల కిందట ఎస్బీఐ స్టాఫ్ కాలనీలో దొంగతనాలు జరగడంతో పోలీసులు ఎస్బీఐ కాలనీ వాళ్లతో ఓ సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరా ల కోసం ఓ గది ఏర్పాటు చేయాలన్నారు. కాలనీ వాసులంతా నిర్ణయించుకొని రిజర్వ్ సైట్లో ఏర్పా టు చేసుకోవాలని స్థలాన్ని చూపించారు. అయితే అక్కడకు వెళ్లే సరికి వాచ్మెన్గా ఉన్న వ్యక్తి ఈ స్థలం తనదేనంటూ నకిలీ డాక్యుమెంట్లు చూపించగా వారంతా కంగుతిన్నారు.
ఈ వ్యక్తి తహసీల్దార్ సంతకాలతో ముందుగా ఓ పొజిషన్ సర్టిఫికెట్ సృష్టించాడు. అక్కడితో ఆగకుండా నివాసం ఉన్న రిజర్వ్ స్థలాన్ని సైతం సెటిల్మెంట్ డీడీ కింద ఒకరి నుంచి ఒకరికి దఖలు పడినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2025 జూలైలో ఆమదావలస రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో కాలనీ వాసులంతా కలిసి తహసీల్దార్ గణపతిరావుకు పొజిషన్ సర్టిఫికెట్ చూపించారు. దీంతో ఆయన ఫోర్జరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అనంతరం శ్రీకాకుళం పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మా కాలనీవాసులంతా కలిసి మల్లేష్ను వాచ్మెన్గా పెట్టుకున్నాం. ఆయనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 11సెంట్లు స్థలాన్ని కబ్జా చేస్తాడని ఊహించలేదు.
– జగదీష్, ఎస్బీఐ కాలనీ అధ్యక్షుడు
తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. జరిగిన విషయంపై మేమంతా కలిసి జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి, ఆమదా లవలస రిజిస్టర్ ఆఫీస్కు, కలెక్టర్ గ్రీవెన్స్కు, ఎస్పీ కార్యాలయానికి, ఆర్డీవో కార్యాలయానికి ఫిర్యాదు చేశాం. – ఎంఆర్ హుస్సేన్, స్టాఫ్ కాలనీ సెక్రటరీ


