శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లావ్యాప్తంగా శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల ‘జలం–జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. అలాగే చెరువులు, కుంటలు వంటి జల వనరుల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా రు. మురుగునీటి నిర్వహణలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించాలని, శుద్ధి చేసిన నీటిని మొక్కలకు పోసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.


