శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శుక్రవారం రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నకు క్వింటాకు రూ.1700 ఉంటే రూ.1500కే కొనుగోలు చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు నష్టపోతున్నారని చెప్పారు. వేరుశనగ, శనగలు, కందులు, అపరాలు ఉద్యాన పంటలకు మద్దతు ధరలు లేక రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఎరువులు కొరతను ఆసరాగా చేసుకొని వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో ప్రధానమైన జీడిపంట సైతం మార్కెట్ లేదన్నారు. మామిడి, అపరాలు పంటలకు ఇన్సూరెన్సు క్లెయిమ్స్ చెల్లించడం లేదన్నారు. మద్దతు ధరల కోసం కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న మండల కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాద్, కె.మోహనరావు, వెలమల రమణ, కరగాన కొండయ్య, కె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


