ఇదీ మన నాయకుల ఘనత..
శ్రీకాకుళం పాతబస్టాండ్/ శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిస్థితికి అద్దం పడుతోంది. నాయకులు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని సామాన్యులు తండోపతండాలుగా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అయితే ఒక్క గ్రీవెన్స్ నాడే కాదు.. ప్రతి రోజూ రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తులపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మరికొందరు బాధితులు తమ సమస్యలు తీరక విసిగి వేసారి పెట్రోల్ బాటిళ్లతో, పురుగుల మందు డబ్బాలతో జిల్లా అధికారుల వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తుండడం, చివరికి ఎండార్స్మెంట్లతో సరిపెట్టేస్తుండటంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మీకోసం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే కార్యక్రమాన్ని పీజీఆర్ఎస్గా మార్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. అధికారులతో పాటు పాలకుల వేధింపులు తాళలేక సామాన్యులు బలైపోతున్న ఘటనలు కూడా జిల్లాలో కనిపిస్తుండడం గమనార్హం.
ఇదేనా పరిష్కారం..
● ఇటీవల నరసన్నపేట మండలంలో ఓ వీఆర్ఓ ఎండార్స్మెంట్పై ఫిర్యాదుదారు సంతకం చేసేసి అర్జీదారు వాట్సాప్కు సమాచారం పెట్టేశారు. ఎండార్స్మెంట్లో తన పేరిట ఉన్న సంతకం చూసి విస్తుపోవడం ఫిర్యాదుదారు వంతైంది.
● జిల్లాలో దాదాపు 4 వేల పింఛన్లు రద్దు చేశారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం పొందిన వారికే మళ్లీ రీ వెరిఫికేషన్ పేరిట నోటీసులు జారీ చేశారు. దీంతో వీరంతా గ్రీవెన్స్కు క్యూ కట్టారు. వీరిలో ఎందరి సమస్యలు పరిష్కరించారో అధికారులకే ఎరుక.
ఖాకీల వైఖరిపై..
● కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యులు కొత్తూరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యా దు చేశారు. కొండపై క్వారీయింగ్ విషయంలో ఫిర్యాదు చేస్తే యువకుడిని స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఎస్ఐపై గ్రామస్తులు కూడా ఫిర్యాదు చేశారు.
● బహిరంగంగా మద్యం సేవిస్తే జరిమానాలు విధించి కేసులు కట్టే పోలీసులు ఎస్పీ గ్రీవెన్స్కు ఏకంగా మద్యం సేవించి వస్తే ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతోంది. ఇటీవల ఎస్పీ గ్రీవెన్స్లో సరుబుజ్జిలి మండలం మాలసవలాపురం గ్రామానికి చెందిన కొంతమంది మద్యం సేవించి వచ్చి కార్యాలయం కింద గార్డుల విధులకు ఆటంకం కలిగించారు.
పాలకుల తీరుకు విసిగిపోతున్న సామాన్యులు
అర్జీదారుల ఆర్తనాదాలతో మార్మోగుతున్న గ్రీవెన్స్
పెట్రోల్ బాటిళ్లు, పురుగు మందు డబ్బాలతో హాజరవుతున్న బాధితులు
పరిష్కారం కాకుండానే..
టెక్కలి : టెక్కలి మండలం రావివలస సమీపంలో స్టోన్ప్లస్ గ్రానైట్ క్వారీ వల్ల తన పంట పొలం నాశనమవుతోందని గ్రామానికి చెందిన బుడ్డ రాంబాబు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. క్వారీ వ్యర్థాల వల్ల తన 95 సెంట్ల పొలంలో పంట పోతోందని పేర్కొన్నాడు. అయితే సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం జరిగినట్లు చూపిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
గత ఏడాది అక్టోబర్ 16న బూర్జ మండలం గుత్తావిల్లికి చెందిన సనపల సురేష్ కారులో వస్తుండగా బలగ మెట్టు వద్ద ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అడ్డగించి దాడికి తెగబడ్డారు. తమ అక్రమాలు బయటకు చెబుతున్నాడనే కక్షతో అందరూ చూస్తుండగానే దాడికి దిగారు. ఎస్పీ మహేశ్వరరెడ్డికి పలుమార్లు మొర పెట్టుకున్నా, రెండో పట్టణ పోలీసుల వద్దకు కాళ్లరిగేలా తిరిగినా సురేష్పై దాడికి సంబంధించి ఇప్పటికీ చార్జిషీటు వేయలేదు.
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అతని అనుచరుల వేధింపులు తాళలేక ఇటీవల పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్, దళిత మహిళైన రేజేటి సౌమ్య శ్రీకాకుళం నగరం తిలక్నగర్లో నివాస గృహంలో బీపీ స్టెరాయిడ్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఏడాది జూలైలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు రోడ్డు అవినీ తిని ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నానికి దిగారని.. ఎమ్మెల్యే బగ్గుతో తనకు ప్రాణహాని ఉందని శ్రీముఖలింగం ఆలయ అర్చకు డు నాయుడుగారి రాజశేఖర్ ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదుచేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి సచివాలయ కార్యాలయానికి, జాతీయమానవ హక్కుల కమిషన్కు సైతం ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది మార్చి 18న తన ప్రాణానికి రక్షణ కల్పించమని సంతబొమ్మాళి మండలం గెద్దలపాడుకు చెందిన ఆశా కార్యకర్త ఎస్.చంద్రమ్మ ఎస్పీని వేడుకున్నారు. తన పోస్టును రూ. 2 లక్షలకు అమ్మేందుకు కొంతమంది సిద్ధపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గార మండలం అంపోలు గాంధీనగర్ వీధికి చెందిన కొల్లి అప్పారావు (45) పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ తీసుకుంటున్నాడు. కానీ అతని పింఛన్ తీసేయడంతో భార్య లలితతో కలసి ఎలుకల మందు, ఫినాయిల్, యాసిడ్ కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ మన నాయకుల ఘనత..
ఇదీ మన నాయకుల ఘనత..


