ఓపెన్‌గా చదివేద్దాం! | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌గా చదివేద్దాం!

Jun 16 2025 7:11 AM | Updated on Jun 16 2025 7:11 AM

ఓపెన్

ఓపెన్‌గా చదివేద్దాం!

● ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల ● వయస్సుతో నిమిత్తం లేకుండా చదువుకునేందుకు అవకాశం ● టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● దరఖాస్తులకు తుది గడువు జూలై 30

శ్రీకాకుళం న్యూకాలనీ :

దువుకోవాలని ఆసక్తి ఉండి అవకాశాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, రోజువారీ స్కూల్‌/కాలేజీకి వెళ్లలేక.. ఇలా కారణమేదైనా విద్యకు దూరమైన వారికి బాసటగా నిలుస్తోంది ఓపెన్‌ స్కూల్‌. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నామమాత్రపు ఫీజుతో సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్‌ స్కూల్‌) దూరవిద్యను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పకడ్బందీగా అందించింది. ప్రస్తుతం అవే ఫీజులు, నిబంధనలను కూటమి ప్రభుత్వం అమలుచేస్తోంది. రెగ్యులర్‌ సర్టిఫికెట్‌తో సమానమైన ఈ విద్యను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.

చదువుకు దూరమైన వారికి..

ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం అండగా నిలుస్తోంది. రెగ్యులర్‌గా పదో తరగతి, ఇంటర్‌ ఫెయిలైన వారు, వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, బాలికలు, గృహిణులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా చేరవచ్చు. గతంలో ఈ దూర విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు. రెండేళ్ల ఇంటర్‌ విద్య అయినా, పదో తరగతైనా ఏడాదిలోనే పూర్తి చేసుకోవచ్చు.

ప్రవేశాలకు వేళాయె..

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ వెలువరించింది. దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలోని ప్రభుత్వ స్టడీ సెంటర్‌ దగ్గర వద్ద గానీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్‌.ఓఆర్జీ వెబ్‌పోర్టల్‌లో జూలై 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య అపరాధ రుసుంతో ఆగస్ట్‌ 15 వరకు చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఈ ఏడాది ఆగస్ట్‌ 31 నాటికి 14 ఏళ్లు వయస్సు నిండిన అభ్యర్థులు పదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. 15 ఏళ్లు పూర్తయి పదో తరగతి పాసైనవారు, ఇంటర్‌ మధ్యలో ఆపేసినవారు/ఫెయిలైనవారు ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

రెగ్యులర్‌ సర్టిఫికెట్‌తో సమానం..

ఓపెన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌కు విలువ ఉంటుందో లేదోననే అపోహ చాలా మందిలో ఉంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జారీ చేసే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సాధారణ పాఠశాల విద్య, కళాశాల విద్య సర్టిఫికెట్లతో సమానం. వీటితో ఉన్నత విద్యకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని విద్యాశాఖాధికారులు, యూనివర్సిటీ అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఓపెన్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాస్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు నేరుగా అభ్యర్థుల చిరునామాకే పంపించేలా గత ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంది.

బాలికా విద్యకు ప్రోత్సాహం..

బాలికా విద్యను ప్రోత్సహించేలా ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అనేక చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక కారణాలు, సమీపంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్య అందుబాటులో లేక వేలాది మంది బాలికలు, గృహిణులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. అలాంటి వారు చదువుకునేందుకు ప్రభుత్వం ఫీజులో రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు, మాజీ సైనికుల పిల్లలకు కూడా ప్రవేశ రుసుం ఫీజులో రాయితీ కల్పిస్తుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఎస్‌ఎస్‌సీకి 45 స్టడీ సెంటర్లు, ఇంటర్మీడియెట్‌కు 30 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి మండలంలో దాదాపుగా అధ్యయన కేంద్రాలు ఉన్నాయి.

ఆసక్తి గల వారికి ప్రవేశాలు కల్పించి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు.

ఎంచుకున్న మీడియం ప్రకారం పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌ అందజేస్తారు.

అడ్మిషన్‌ పొందిన వారు 30 తరగతులకు కచ్చితంగా హాజరు కావాలి. అలాగైతేనే పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు.

అడ్మిషన్‌ పొందిన వారికి ఉత్తీర్ణత సాధించేందుకు ఐదేళ్ల వరకు అవకాశం ఇస్తారు.

టెన్త్‌, ఇంటర్‌ కోర్సుల్లో చేరాలనుకునే వారు తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఇతర మీడియంలో కూడా కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

ఇంటర్‌లో సైన్స్‌ ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్‌ సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ ఇతరత్ర గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.

ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ముఖ్యమైన సమాచారం తెలియజేసేందుకు, పాఠాల కోసం ‘జ్ఞానధార’ పేరిట ప్రత్యేక యూట్యూబ్‌ చానెల్‌ను గత ప్రభుత్వం ప్రారంభించింది.

దరఖాస్తు చేసుకోవాలి..

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. జూలై 30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అంగన్‌వాడీలు, గ్రామ సచివాలయం సిబ్బంది, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ తీసుకోవాలి.

– లియాకత్‌ ఆలీఖాన్‌,

ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌

రెగ్యులర్‌ విద్యతో సమానం

వివిధ కారణాలతో చదువు మధ్యలో చదువు ఆపేసినవారికి ఓపెన్‌ స్కూల్‌ వరం లాంటిది. టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేయడానికి మంచి సదావకాశం. దిగువశ్రేణి ఉద్యోగులు, గృహిణిలు, వ్యాపారులు, అంగన్‌వాడీలు, ఆయాలు, ఆశా కార్యకర్తలకు ఉపయుక్తమైంది. ఓపెన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ రెగ్యులర్‌ విద్య సర్టిఫికెట్‌తో సమానం.

– డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్య,

జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం

ఓపెన్‌గా చదివేద్దాం! 1
1/5

ఓపెన్‌గా చదివేద్దాం!

ఓపెన్‌గా చదివేద్దాం! 2
2/5

ఓపెన్‌గా చదివేద్దాం!

ఓపెన్‌గా చదివేద్దాం! 3
3/5

ఓపెన్‌గా చదివేద్దాం!

ఓపెన్‌గా చదివేద్దాం! 4
4/5

ఓపెన్‌గా చదివేద్దాం!

ఓపెన్‌గా చదివేద్దాం! 5
5/5

ఓపెన్‌గా చదివేద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement