పూర్తిగా వస్తే ఒట్టు! | - | Sakshi
Sakshi News home page

పూర్తిగా వస్తే ఒట్టు!

Jun 16 2025 7:11 AM | Updated on Jun 16 2025 7:11 AM

పూర్త

పూర్తిగా వస్తే ఒట్టు!

స్టూడెంట్‌ కిట్టు..
● బూట్లు, యూనిఫాం రాకపోవడంతో చాలాచోట్ల నిలిచిన పంపిణీ ● అరకొర వస్తువులు రావడంతో చేతులెత్తేస్తున్న ఉపాధ్యాయులు ● కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల సమక్షంలో హడావుడిగా పంపిణీ ● ప్రశ్నిస్తారనే భయంతో మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ జూలై 5కి వాయిదా!

శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.. చేసిందేమి లేదన్న విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బడులు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు 8 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లు అందజేసేవారు. గత ఏడాది మాత్రం.. అప్పటికే జగన్‌ ప్రభుత్వం ఇండెంట్‌ ప్రకారం సమకూర్చిన విద్యాకానుక(విద్యార్థి మిత్రగా పేరు మార్చి పంపిణీ చేశారు.)ను మొదటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తిచేశారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరిట స్టూడెంట్‌ కిట్‌ను అందజేయడంలో ఘోరంగా విఫలమైంది. పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బ్యాగులు, యూనిఫాం ఇలా ఏ వస్తువులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో కిట్లను అందజేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పంపిణీ చేయకుండా బాక్సుల్లోనే ఉంచేస్తున్నారు. అక్కడక్కడ ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఒకటి రెండు వస్తువులతో పంపిణీచేసి ‘కిట్లు అందజేసేశాం’ అని సామాజిక మాధ్యమాల్లోల్లో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొన్ని చోట్ల వచ్చిన కొన్ని వస్తువులనే పంపిణీ చేద్దామంటే.. ప్రజాప్రతినిధులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం లేదని ఉపాధ్యాయులే చెబుతున్నారు. విద్యార్థి మిత్ర స్టూడెంట్‌ కిట్‌ ఐటమ్స్‌లో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు తర్వాత అత్యంత కీలకమైనవి బూట్లు, బట్టలు. జిల్లాలో 30 మండలాలు ఉండగా నేటికి 10 మండలాలకు బూట్లు, యూనిఫాం చేరలేదు.

పేరెంట్స్‌ మీటింగ్‌ వాయిదా..

సర్కారీ బడుల్లో పేరెంట్స్‌ మీటింగ్‌ తల్లిదండ్రులుతో బడులు పునఃప్రారంభమైన మొదటివారంలోనే నిర్వహించాల్సి ఉంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వాయిదా వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా తల్లికి వందనం పథకం పథకాన్ని సవాలక్ష ఆంక్షల నడుమ వేలాది మంది అర్హులను.. అనర్హులుగా మార్చేశారు. ఇంకా చాలా మందికి నగదు జమకాలేదు. మరోవైపు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు రాలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత క్షీణించింది. వీటన్నింటిని తల్లిదండ్రులు పశ్నిస్తారనే భయంతో ఇప్పుడు సమావేశం నిర్వహించకుండా జూలై 5వ తేదీ నాటికి పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ వాయిదా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థులు తగ్గారు.. బడ్జెట్‌ పెరిగింది..

కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యాశాఖలో అవకతవకలు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. గతంలో 46 లక్షల మంది విద్యార్థులకు మన్నిక, నాణ్యమైన విద్యా సామగ్రితో కూడిన జగనన్న విద్యాకానుక కోసం రూ.650 కోట్ల మేర బడ్జెట్‌ వెచ్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 40లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్ధి మిత్ర కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లకు బడ్జెట్‌ పెంచారు. 6లక్షల మంది విద్యార్థులు తగ్గితే రూ.350 కోట్ల బడ్జెట్‌ పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వారికి నో యూనిఫాం.

కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మార్చిన కొత్త యూనిఫాంను ఇంటర్‌ విద్యార్థులకు ఇవ్వడంలేదు. ఇప్పటికే మాజీ సీఎం జగన్‌ సమకూర్చిన పాత యూనిఫాం ఎక్కడా కనిపించడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. తాజాగా మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, హైస్కూల్‌ ప్లస్‌ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులు పాత యూనిఫాం ధరించాలని ప్రభుత్వమే నిర్ణయించిందని విద్యాశాఖ అధికారులు చెబుతుండటం కొసమెరుపు.

పూర్తిగా వస్తే ఒట్టు! 1
1/1

పూర్తిగా వస్తే ఒట్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement