
మోసం కేసులో వ్యాపారికి జైలుశిక్ష
ఇచ్ఛాపురం : పట్టణానికి చెందిన పెయింటింగ్ వ్యాపారి కాళ్ల శ్రీనివాసరావు 2017లో నకిలీ ఏషియన్ పెయింట్స్ తయారుచేసి అమ్ముతుండగా పట్టుబడటంతో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నిందితునికి రెండున్నరేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిందని పట్టణ ఎస్సై ముకుందరావు ఆదివారం తెలియజేశారు.
గొల్లగండి తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
సోంపేట: గొల్లగండి సముద్రతీరానికి ఆదివాయం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం చేరింది. స్థానికులు గమనించి బారువ పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని పరిశీలించారు. బారువ ఏఎస్ఐ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
జిల్లాలో టీచర్ల బదిలీలు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సాధారణ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అన్ని కేటగిరిల్లో మొత్తం 6392 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు చేసుకోగా 3546 మంది బదిలీ అయ్యారు. వీరిలో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 1967 మంది ఉన్నారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే విధుల్లో చేరిపోగా.. తాజాగా ముగిసిన ఎస్జీటీల బదిలీలతో రెండు మూడు రోజుల్లో వీరంతా వారు ఎంపికచేసుకున్న స్థానాల్లో చేరనున్నారు. జిల్లాలో 124 మంది ఎస్ఏలు, ఎస్జీటీలు పదోన్నతులు పొందినట్టు డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య ధృవీకరించారు. మరోవైపు, కూటమి ప్రభుతం అస్పష్టత విధానాలు వల్ల నష్టపోయామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.