
సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం ఎందుకివ్వరు?
● వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన
కృష్ణదాస్
పాతపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తున్నారా..? వారి పిల్లలకు తల్లికి వందనం ఇవ్వకపోవడానికి కారణమేంటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. పాతపట్నంలో ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. సర్పంచ్లకు గౌరవ వేతనంగా ప్రభుత్వం కేవలం రూ.3వేలు అందజేస్తుందని, ఆ మాత్రం దానికి ఏకంగా తల్లికి వందనం వంటి పథకాలు నిలిపివేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలకు దగ్గరై కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన సర్పంచ్లు ధనికులో, ఉద్యోగులో కారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగితన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులు సర్పంచ్లుగా ఎన్నిక కావడమే దీనికి కారణంగా భావిస్తున్నామని, ఇది కక్షపూరిత చర్య అని చెప్పారు. గ్రామ పంచాయతీలకు నేరుగా చెల్లించాల్సిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి మళ్లించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తప్పు పడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు.అంతకుముందు పాతపట్నం ఎగువ కండ్రవీధిలో ఉంటున్న నవతల సర్పంచ్ పల్లి శ్రీహరిను కృష్ణదాస్ పరామర్శించారు. శ్రీహరి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యరుకోల వెంకటరమణ, వరుదు దేవిప్రసాద్, బొంగు కొండయ్య, ఎల శ్యామ్, గల్లంగి వెంకటరావు, కొండాల బాబురావు, ప్రశాంత్, కాళ్ల సింహాచలం, పల్లి క్రిష్ణ, యడ్ల రంగారావులు పాల్గొన్నారు.
దళిత, ఆదివాసీలకు
ప్రత్యేక నియోజకవర్గాలు
● భీమ్ సేన ఉత్తరాంధ్ర యువ
సమ్మేళనంలో వక్తలు డిమాండ్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుచేయాలని భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ డిమాండ్ చేశారు. భీమ్ సేన ఉత్తరాంధ్ర యువ సమ్మేళనం మూడో సదస్సు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఆదివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు లేకపోవడం వల్లే అసెంబ్లీ, పార్లమెంటులో హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం దక్కడం లేదన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం తగిన కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు కల్లేపల్లి రాంగోపాల్, డాక్టర్ అంబేడ్కర్, నగిరి మోహన్రావు, డాక్టర్ కంఠ వేణు, బడియా కామరాజు, డి.గణేష్, బోయిడి మురళీకృష్ణ, బోనెల రమేష్, బత్తిన మోహన్రావు, లింగాల అప్పన్న, శరత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ
ఉత్పత్తులకు డిమాండ్
ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంట ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని అలాగే వాటికి మార్కెట్లో అధిక ధర కూడా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పూజారి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని చేపేనపేట, నిమ్మతొర్లాడ గ్రామాల్లో క్షేత్ర పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం పర్యటించారు. డీపీఎం మాట్లాడుతూ రైతులు విత్తనం నాటిన నుంచి మళ్లీ కోత వరకు ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించే రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తమ సిబ్బంది ద్వారా విక్రయించి ప్రోత్సహిస్తామన్నారు.
చేపేనపేటలో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్న డీపీఎం పూజారి సత్యనారాయణ తదితరులు

సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం ఎందుకివ్వరు?

సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం ఎందుకివ్వరు?