
పలాసలో మద్యం దందా
దిగజారుడు రాజకీయాలెందుకు..
కాశీబుగ్గ: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేపడుతున్న అభివృద్ధి, అవినీతిపై డిబేట్ పెడితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పలాసలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గౌతు లచ్చన్న మనవరాలిగా, మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తెగా శిరీష దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలపై చేసిన సర్వేలో ఆ పార్టీలో ఉన్న 72 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని, అందులో పలాస ఎమ్మెల్యే శిరీష ఒకరని ఉదహరించారు. పలాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో పలాస అల్లుడు టాక్స్ అని విమర్శించారని, మళ్లీ అదే తంతు జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే సహకారం లేకపోతే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష పద్ధతిగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని హితవుపలికారు. 40 ఏళ్లుగా పలాస నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో.. వైఎస్సార్ సీపీ పాలనలో ఐదేళ్ల పాటు మంత్రిగా తాను చేసిన అభివృద్ధి ఏంటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే శిరీషకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్