
వెంటాడిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ● మహిళను బైక్తో ఢీకొట్టడంతో ప్రమాదం ● మృతుల్లో ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్
టెక్కలి రూరల్/ఇచ్ఛాపురం రూరల్/సోంపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. టెక్కలి మండలం ఒలేసాగరం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాత్ర రవీంద్ర నాయకో కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం అర్థరాత్రి టెక్కలి మండలం ఒలేసాగరం సమీపంలో జాతీయ రహదారిపై బస్సుదిగారు. ముందుగా భార్యాపిల్లలను రోడ్డు దాటించారు. అనంతరం తల్లి సుభద్రా నాయకో(58)ను రోడ్డు దాటిస్తుండగా ఇచ్ఛాపురం పోలీస్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పొట్టి జగదీశ్వరరావు(45) ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో సుభద్రా నాయకోతో పాటు జగదీశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శిక్షణ కోసం వెళ్తూ..
కాగా, హెడ్ కానిస్టేబుల్ జగదీశ్వరరావు మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఈయన విజయనగరంలో శిక్షణ ఉండటంతో శనివారం రాత్రి తన ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. స్వగ్రామం సోంపేట మండలం ఎర్రముక్కాం. భార్య పుష్ప, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు సాయి ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపారు. జగదీశ్వరరావు మృతి పట్ల సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్ఐ. ఈ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.