
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం గ్రాడ్యుయేషన్ (జెనిత్స్–2020)డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్స్ చీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. పదేళ్లలో బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా పది వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో వారంతా ఉద్యోగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. బీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెమ్స్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధీర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పారామెడికల్ టెక్నీషియన్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.అశోక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు నడుచుకోవాలన్నారు. జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా ఇప్పటివరకూ పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ, జెమ్స్ సీఈఓలు ఆద్విక్, రామ్మోహన్ పాల్గోన్నారు.