అనంతపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆరు నెలలుగా వీరికి జీతాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో దాదాపు 1100 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 107 మంది ఉన్నారు. వీరికి జీతం నెలకు రూ.28 వేలు. అయితే మార్చి నుంచి వేతనం ఆగిపోయింది. ప్రభుత్వం వేతనాల చెల్లింపు కోసం బడ్జెట్ విడుదల చేయాలని, తక్షణమే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యూవల్ చేయాలని గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు.
శ్రమ దోపిడీ..
గెస్ట్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించక, సకాలంలో రెన్యూవల్ ప్రొసీడింగులు, వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు శాంక్షన్డ్– నాన్ శాంక్షన్డ్ పోస్టుల పేరుతో వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు 70 గంటల పాటు పనిచేయాల్సి ఉన్నప్పటికీ, రెట్టింపు చేయించుకుంటున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. శాంక్షన్డ్ పోస్టుల్లో చేరిన వారికి నెలకు రూ.28 వేల వేతనం ఇస్తుంటే.. నెలలో 70 గంటలకు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నాన్ శాంక్షన్డ్ పోస్టులతో సమానంగా తాము పనులు చేస్తున్నా వేతనాల్లో మాత్రం భారీగా తేడా ఉంటోందని గెస్ట్ లెక్చరర్లు వాపోతున్నారు.
ఆరు నెలలుగా అందని జీతాలు
డిగ్రీ కళాశాలల అధ్యాపకులపై
చిన్నచూపు
కుటుంబ పోషణకు
ఇబ్బందులు పడుతున్న వైనం


