కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో శనివారం రాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. స్థానిక జయనగర్ కాలనీలోని సుధాకర్ ఇంటి తాళం ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే ఇంట్లో మరో గదిలో ఉన్న లాకర్ తెరిచేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. అదే కాలనీల్లో మరో ఇంట్లో దొపిడీకి యత్నించారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఎలాంటి నగదు దొరక్క వెళ్లిపోయారు. ఉదయం ఇంటి యజమానులు ఇంటితాళాలు తెరిచి ఉండటతో దొంగతనం జరిగినట్లు భావించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో పశువుల దొంగలు
ఉరవకొండ: ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని వై.రాంపురం గ్రామానికి చెందిన కొందరు రాత్రి సమయాల్లో గ్రామాల్లో పశువులను ఎత్తుకెళ్లి, వాటిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దొంగలను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
సుమో,బస్సు ఢీకొని ఒకరి మృతి
లేపాక్షి: మండలంలోని పులమతి వద్ద ఆదివారం సు మో, ప్రైవేట్ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో హీరేబిదనూరుకు చెందిన సరోజమ్మ (50) మృతి చెందింది. వివరాలు.. కర్ణాటకలోని హీరేబిదనూరుకు చెందిన సరోజమ్మ సుమోలో వెళ్తుండగా, అదే సమయంలో హిందూపురం వైపు నుంచి పులమతి వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొనింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న సరోజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సుమో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిరుత కలకలం
కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని రాయదుర్గం రోడ్డు సమీపంలో ఆదివారం చిరుత స్థానికులకు తారస పడింది. దీంతో చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో చిరుత పక్కనే ఉన్న కొండల్లోకి పరుగుతీసింది. కళ్యాణదుర్గం కొండ ప్రాంతాల్లో చిరుత కనిపిస్తోందని అనేకసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చెందారు.


