హిందూపురం టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజ్జల ప్రసాద్రెడ్డి, గోపాల్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక అజీజియా ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కడియా మురళి, రాష్ట్ర బాధ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తున్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ రాయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సీపీఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ సుధాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, జాఫర్ హుస్సేన్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఆనంద్, ఉదయ్ కుమార్, ముద్దు కృష్ణ, రాము, రాజగోపాల్, వసీం, శంకర్ నాయక్, రవి నాయక్, మనోహర్, కుమార్, హరి, తిరుపతయ్య, భీమప్ప తదితరులు పాల్గొన్నారు.


