పుట్టపర్తి టౌన్: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పుట్టపర్తి పట్టణంలో విద్యాగిరి ఆర్చ్ వద్ద జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్, ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానాతో పాటు జిల్లాస్థాయి అధికారులు, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా చేయడానికి స్థలం, ఖరీదైన పరికరాలు అవపరం లేదని ఇంట్లోలోనే సాధన చేసుకోవచ్చన్నారు. యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. అనంతరం 76 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా యువకులకు స్ఫూర్తి ఇచ్చేలా యోగాసానాలు వేసిన నారాయణరెడ్డితో పాటు రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఆర్డీఓ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


