ధర్మవరం అర్బన్: ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1)లో సవరణ చేసే ప్రయత్నం చేయాలన్నారు. అప్పటిలోగా ప్రభుత్వ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక టెట్ నిర్వహిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వినతిపత్రాలిస్తామని, 30న మండల కేంద్రాల్లో నిరసన దీక్ష, జులై 2న జిల్లాస్థారయిలో ఒకరోజు నిరాహార దీక్ష, జులై 15న రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు తక్షణం స్పందించి ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, గౌరవాధ్యక్షుడు భూతన్న, కోశాధికారి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లు తాహిర్వలి, మేరివరకుమారి, నాయకులు సుధాకర్, అమర్నారాయణరెడ్డి, నరసింహప్ప, బాబు, నాగేంద్రమ్మ, సునిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


