రొళ్ల: విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు కన్నెర్ర చేశారు. ఏకంగా సబ్స్టేషన్ వద్దకే వెళ్లి ఆందోళనకు దిగారు. అప్రకటిత కోతలతో పంటలకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించి ఆదుకోవాలని కోరారు.
నెలరోజులుగా సమస్య..
మల్లినమడుగు పంచాయతీకి బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. పంచాయతీ పరిధిలోని మల్లినమడుగు, కాల్వేపల్లి, జీరిగేపల్లి, హెచ్టీ వడ్రహట్టితో పాటు హెచ్టీ హళ్లి, హొసగొల్లహట్టి గ్రామాలకు నెలరోజులుగా త్రీఫేస్ విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదు. దీంతో రబీలో సాగు చేసిన వివిధ పంటలు ఎండుతున్నాయి. దీని గురించి రైతులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం సోమవారం ఆయా గ్రామాలకు చెందిన రైతులు బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... నెల రోజులుగా కనీసం రోజుకు మూడు గంటలు కూడా త్రీఫేస్ విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు. దీంతో రబీలో బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ, రాగి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలైన మల్బరీ, దానిమ్మ, వక్క, అరటి తదితర పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ నిజాముద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. దీంతో రైతులు మల్లినమడుగు పంచాయతీకి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని, ఇందుకోసం సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా అందిస్తామని రైతులు ఏఈకి తెలిపారు. స్పందించిన ఏఈ.. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
బీజీహళ్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన
విద్యుత్ శాఖ ఏఈ హామీతో
శాంతించిన వైనం


