మడకశిర: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ వివాహిత మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... మడకశిరలోని శంకర్నగర్లో నివాసముంటున్న లలితమ్మ ((54) కు భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం గాలిపటం ఎగురవేసే క్రమంలో మిద్దె పై నుంచి కిందపడి కుమారుడు మృతి చెందాడు. అప్పటి నుంచి భర్త, కుమారుడితో కలసి నివాసముంటున్న ఆమె సోమవారం ఉదయం భోగిరామేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి వచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న సమయంలో అప్పటికే సంపు పూర్తిగా నిండి నీరంతా వృథాగా రోడ్డుపైకి వెళుతుండడం గమనించిన ఆమె గేట్ వాల్ బంద్ చేసేందుకు వెళుతుండగా కాలు జారి సంపులోకి పడిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు సంపులో నిర్జీవంగా తేలియాడుతున్న లలితమ్మను వెలికి తీశారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ లావణ్య తెలిపారు.
చెత్త ఇవ్వండి.. సరుకులు పట్టుకెళ్లండి
● డీపీఓ సమత
పుట్టపర్తి అర్బన్: స్వచ్ఛరథం ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఇళ్లలోని చెత్తను ఇచ్చి అవసరమైన సరుకులు తీసుకెళ్లాలని ప్రజలకు జిల్లా పంచాయతీ అధికారి సమత పిలుపునిచ్చారు. పుట్టపర్తి మండలం కప్పలబండలో స్వచ్ఛ రథాన్ని సోమవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. 25 రోజుల పాటు మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ స్వచ్ఛ రథాలు ఇంటింటికీ తిరిగి పొడి చెత్తను సేకరిస్తాయన్నారు. పాత ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు బాటిళ్లు, వృథాగా ఉన్న స్టీల్.. అల్యూమినియం సామగ్రి, తదితర వస్తువులనుసేకరించి వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఆపరేటర్ చెల్లిస్తాడన్నారు. డబ్బుకు బదులు కొబ్బరి నూనె, వేరుశనగ విత్తనాలు, షాంపూ ప్యాకెట్లు, తినుబండారాల ప్యాకెట్లు, పెద్ద ఉల్లిపాయలు, పెన్నులు, పెన్సిళ్లు, గోధుమ పిండి, మినపగుళ్లు, కంది పప్పు వంటివి పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ శంకరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, సర్పంచ్ చిన్న పెద్దన్న, ఎంపీటీసీ మధురిమ, తదితరులు పాల్గొన్నారు.


